బషీర్బాగ్, వెలుగు:బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 27న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రకటించాయి. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు, ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ కలిసి దీక్ష వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
గత, ప్రస్తుత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో, రాజ్యసభ సీట్లలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. దుర్గయ్యగౌడ్, వెంకన్నగౌడ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
